TSPSC GROUP-2 అభ్యర్థులపై లాఠీచార్జ్.. టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద టెన్షన్ టెన్షన్

గ్రూప్ 2 వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో టీఎస్సీపీస్సీ ( TSPSC) కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనను అడ్డుకుంటున్న పోలీసులపై కొంతమంది అభ్యర్థులు దాడికి దిగడంతో పోలీసులు, అభ్యర్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరసన విరమించబోమని అభ్యర్థులు చెప్పారు.

గోశామహల్ స్టేడియానికి అభ్యర్థులు..

గ్రూప్ 2 వాయిదా వేయాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం(TJS president Kodandaram) ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గ్రూప్ 2 అభ్యర్థులు భారీ సంఖ్యలో టీఎస్పీఎస్సీ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. టీఎస్పీఎస్సీ ముందు ఆందోళన చేస్తున్న టీజేఎస్ నేతలను, NSUI రాష్ట్ర అధ్యక్షుడు బలుమూరి వెంకట్‌ను పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకుని గోషామహల్‌ స్టేడియానికి తరలించారు. దాదాపు 200 మందిని అదుపులోకి తీసుకొని గోషామహల్ స్టేడియానికి తరలించారు. గోషామహల్‌ స్టేడియంలో తమను బంధించారంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అలాగే గోశామహల్ స్టేడియంలో ఉన్న అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ ముందు మరి కొంతమంది అభ్యర్థులు ఆందోళన చేపట్టారు.శాంతియుతంగా తమ నిరసన తెలియజేస్తే పోలీసులు అనైతికంగా ప్రవర్తిస్తున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 2 పరీక్షల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో టీఎస్పీఎస్సీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అభ్యర్థులు ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా టీఎస్పీఎస్సీ వద్ద పోలీసులు బారీగా మోహరించారు.

ఆందోళన విరమించాలి: డీసీపీ వెంకటేశ్వర్లు

ఆందోళన చేస్తున్న అభ్యర్థులతో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడారు. మరికాసేపట్లో ఆందోళన ఆపేయాలని లేకపోతే ఆందోళన చేస్తున్న వారందరినీ అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఉదయం వచ్చిన అభ్యర్థులను ముందస్తుగా అరెస్ట్ చేశామని, ఆందోళన విరమించకపోతే మిగతా వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. శాంతియుతంగా ధర్నా చేసుకుంటామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కోరితే గంట అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అభ్యర్థులు, నేతలు మూడుగంటలుగా ఆందోళన చేస్తున్నారని.. వెంటనే నిరసనను విరమించుకోవాలని డీసీపీ వెంకటేశ్వర్లు కోరారు. 48 గంటల్లో TSPSC నుంచి అభ్యర్థులకు అనుకూలమైన ప్రకటన వస్తుందని చెప్తున్న.. రాష్ట్రప్రభుత్వం మరియు TSPSC పై నమ్మకం లేదన్నారు. మంత్రి కేటీఆర్ వచ్చి భరోసా ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. గ్రూప్2 వాయిదా వేస్తున్నట్లు లిఖితపూర్వక ప్రకటన ఇస్తే తప్పా ఇక్కడి నుంచి కదలమని అభ్యర్థులు ఖరాఖండిగా పోలీసులకు చెప్పారు. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ కార్యాలయాకి భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళన చేపట్టారు. ఆందోళనలు ఉధృతం కావడంతో పోలీసులు అభ్యర్థులను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

టీఎస్ హైకోర్టులో పిటీషన్..

గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈనెల 29, 30వ తేదీల్లో తలపెట్టిన గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో 150 మంది గ్రూప్ 2 అభ్యర్థులు హైకోర్టులో పిటీషన్ వేశారు. గురుకుల, ఇతర నియామక పరీక్షలు ఉన్నందున గ్రూప్2 పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని అభ్యర్థులు హైకోర్టు‌ని పిటిషన్‌లో కోరారు.

TS TET 2023 Notification

తెలంగాణ లో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం సంతోషకరమైన వార్త చెప్పింది. ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఎట్టకేలకు ఏడాది తర్వాత టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ 2023 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. డీఎస్సీ లేదా టీఆర్టీలో ఈ టెట్ లో సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ కూడా ఉంటుంది. కాబట్టి దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. టెట్ 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

దేశవ్యాప్తంగా ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రైమరీ, ఎలిమెంటరీ స్థాయిలో విద్యను బోధించే ఉపాధ్యాయులకు ఎన్సీటీఈ (NCTE) టీచర్ ఎలిజిబులిటీ టెస్టును తప్పనిసరి చేసింది. 2011 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ టెట్ నిర్వహిస్తున్నారు. దీనిని ప్రతి ఆరు నెలలకు ఓసారి నిర్వహించాలనే నిబంధనలు ఉన్నాయి. తెలంగాణ ఎస్సీఈఆర్టీ ఆదేశాల మేరకు గతేదాడి జూన్లో టెట్ పరీక్షను నిర్వహించారు. మళ్లీ ఏడాది తర్వాత ఈ ఆగస్ట్ 01న టెట్ నోటిఫికేషన్ వచ్చింది. గతేడాది నుంచి బీఈడీ వారికి కూడా తెలంగాణ టెట్ పేపర్-1 రాసేందుకు అర్హతను కల్పించారు.

టెట్ పరీక్షను 150 మార్కులకు నిర్వహిస్తారు.
జనరల్ అభ్యర్థులు 60 శాతం, బీసీ అభ్యర్థులు 50శాతం, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 40 శాతం మార్కులు సాధించాలి. టెట్లో ఒకసారి అర్హత సాధిస్తే.. జీవితకాలం పాటు వ్యాలిడిటీ ఉంటుంది.(గతంలో 7 సం.లు ఉండేది) టెట్ పరీక్షలో సాధించిన మార్కులకు గాను డీఎస్సీ లేదా టీఆర్టీలో 20 శాతం వెయిటేజీ కల్పిస్తారు.

టెట్-2023 షెడ్యూల్
ఆగస్ట్ 01 - నోటిఫికేషన్ విడుదల
ఆగస్ట్ 02 నుంచి 16 వరకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ
సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష
సెప్టెంబర్ 27న ఫలితాల విడుదల

రాతపరీక్ష తేదీ సెప్టెంబర్‌ 15
పేపర్‌-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
పేపర్‌-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు

పరీక్ష ఫీజు: రూ.400
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
వెబ్‌సైట్‌: https://tstet.cgg.gov.in

టెట్ అర్హతలు ఇవే..
టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ పేపర్-1, పేపర్-2 రెండు విభాగాల్లో నిర్వహిస్తారు. టెట్ పేపర్-1కు డీఈడీ తో పాటు బీఈడీ చేసిన వారు అర్హులవుతారు. పేపర్-2 కు కేవలం బీఈడీ చేసిన వారు అర్హత కలిగి ఉంటారు. స్పెషల్ బీఈడీ, స్పెషల్ డీఈడీ చేసిన వారు కూడా టెట్కు దరఖాస్తు చేసుకోవచ్చు

టెట్ పరీక్ష విధానం
టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ -1 లో సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లతో పాటు మ్యాథ్స్, ఈవీఎస్ సబ్జెక్టులు, వాటికి సంబంధించిన మెథడాలజీ
ఉంటుంది.

టెట్ పేపర్-1 (మొత్తం 150 మార్కులు)
సైకాలజీ- 30 మార్కులు
తెలుగు కంటెంట్+ మెథడాలజీ-24+6=30 మార్కులు
ఇంగ్లీష్ కంటెంట్+మెథడాలజీ-24+6=30 మార్కులు
మ్యాథ్స్ కంటెంట్+మెథడాలజీ-24+6=30 మార్కులు
ఈవీఎస్ కంటెంట్+మెథడాలజీ-24+6=30 మార్కులు

టెట్ పేపర్ -2 (మొత్తం 150 మార్కులు)
సైకాలజీ - 30 మార్కులు
తెలుగు కంటెంట్+మెథడాలజీ-30 మార్కులు
మ్యాథ్స్ + సైన్స్-60 మార్కులు ( మ్యాథ్స్ + సైన్స్ అభ్యర్థులకు)
సోషల్ కంటెంట్+మెథడాలజీ= 60 మార్కులు ( సోషల్ అభ్యర్థులకు మాత్రమే.

అప్లికేషన్ చేసుకునే విధానం పూర్తిగా ఈ వీడియోలో.....

TREIRB TGT Hall Ticket 2023 తెలంగాణ గురుకుల ఉద్యోగాల హాల్‌టికెట్లు విడుదల

 TREIRB TGT Hall Ticket 2023 : తెలంగాణ గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. ఈ ఉద్యోగాలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. హాల్‌టికెట్లు ఈ లింక్ ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.



CLICK Here : https://treirb.aptonline.in/UI/LoginPages/Login.aspx

ఈ లింక్ ను క్లిక్ చేసి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. అభ్యర్థులు తాము అప్లయ్‌ చేసిన పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత అభ్యర్థులు తమకు ఏఏ రోజుల్లో పరీక్షలు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. తెలంగాణలో మొత్తం 9,210 టీచర్‌ ఉద్యోగాల‌ భర్తీకి తెలంగాణ గురుకుల విద్యాసంస్ధల నియామక బోర్డు (TREIRB) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ పోస్టుల‌కు ఆగస్టు 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు TREIRB ఇప్పటికే ప్రకటించింది.

అలాగే.. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన హాల్‌టికెట్లు https://treirb.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అప్లయ్‌ చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలతో TREIRB వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి దరఖాస్తు చేసిన సబ్జెక్టుల వారీగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొత్తం 9,210 పోస్టులకు గాను.. 2.63 లక్షల మందికి పైగా అభ్యర్ధులు అప్లయ్‌ చేసుకున్నారు. ఒక్క పోస్టుకు సగటున 29 మంది అభ్యర్ధులు పోటి పడుతుండటం విశేషం.

ప్రతిరోజూ మూడు షిప్టుల్లో TREIRB TGT పరీక్షలు :

TREIRB TGT పోస్టులకు సంబంధించి కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ఆగస్టు 1 నుంచి ప్రతిరోజూ మూడు షిప్టుల్లో పరీక్షలుంటాయి. మొదటి షిఫ్టు ఉదయం 8.30 నుంచి 10.30 వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు, మూడో షిఫ్టు సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు నిర్వహిస్తారు.

డిగ్రీ, బీఈడీ అర్హతతో ఏకలవ్య పాఠశాలల్లో 5660 టీజీటీ, 669 హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులు

ఖాళీలు 6329

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల (EMRS) లో డైరెక్ట్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌(NESTS) దరఖాస్తులు కోరుతోంది.

1. ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(TGT): 5,660

సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లీష్‌, మేథ్స్‌, సోషల్‌ స్టడీస్‌, సైన్స్‌, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఉర్దూ, మిజో, సంస్కృతం, సంతాలి, మ్యూజిక్‌, ఆర్ట్‌, పీఈటీ(మేల్‌), పీఈటీ(ఫిమేల్‌), లైబ్రేరియన్‌.

2. హాస్టల్‌ వార్డెన్‌(పురుషులు): 335
3. హాస్టల్‌ వార్డెన్‌(మహిళలు): 334

🔴 అర్హత: టీజీటీ ఖాళీలకు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ; టీజీటీ లైబ్రేరియన్‌ పోస్టులకు డిగ్రీ, బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

🔴 వయోపరిమితి: 2023 ఆగస్టు 18 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి

🔴 జీతభత్యాలు: నెలకు టీజీటీ ఉద్యోగాలకు రూ.44,900 - 142400/ రూ.35400-112400; హాస్టల్‌ వార్డెన్‌కు రూ.29,200 - రూ.92,300 చెల్లిస్తారు.

🔴 ఎంపిక ప్రక్రియ: ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్‌ సెలెక్షన్‌ ఎగ్జామ్‌-2023, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔴 పరీక్ష విధానం: ఓఎంఆర్‌ ఆధారిత(పెన్‌ పేపర్‌) విధానంలో ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు అడుగుతారు. టీజీటీ రాత పరీక్షకు 120 మార్కులు(120 ప్రశ్నలు), లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్టుకు 30 మార్కులు(30 ప్రశ్నలు) కేటాయించారు. హాస్టల్‌ వార్డెన్‌ రాత పరీక్షకు 120 మార్కులు(120 ప్రశ్నలు) కేటాయించారు. టీజీటీ పరీక్షకు మూడు గంటలు, హాస్టల్‌ వార్డెన్‌ పరీక్షకు రెండున్నర గంటల వ్యవధి ఉంటుంది.

🔴 దరఖాస్తు రుసుము: టీజీటీ రూ.1500; హాస్టల్‌ వార్డెన్‌ రూ.1000. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 18

వెబ్‌సైట్‌: https://emrs.tribal.gov.in/

అధికమాసం అంటే ఏంటి?

నిజ శ్రావణ మాసం ఎప్పటి నుంచి?

అధికమాసం, నిజ శ్రావణ మాసం తేదీలు, ఆయా సమయాల్లో చేయాల్సిన కార్యాల గురించి తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కాలగణన సూర్యచంద్రుల ఆధారంగా జరుగుతుంది. సూర్యుని ఆధారంగా లెక్కగట్టే కాలమానాన్ని సౌరమానం అని, చంద్రుని ఆధారంగా లెక్కగట్టే సంవత్సర గణనాన్ని చంద్రమానమని అంటారు..

చాంద్రమానంలో ఒక నెల అంటే 29.53 రోజులు. దీనిప్రకారం చాంద్రమానంలో ఒక సంవత్సరం అంటే 354 రోజులు. అనగా చాంద్రమాన పద్ధతిలో సంవత్సరానికి 11 రోజుల తేడా ఏర్పడుతుంది. సౌరమానం చాంద్రమానంలో ఈ తేడా ప్రతీ నాలుగు సంవత్సరాలలో 31 రోజులు అవుతుంది. అది అధిక మాసంగా ఏర్పడును.

అందుచేత 32 నెలలకు ఒకసారి ఏర్పడు మాసాన్ని అధిక మాసంగా, చాంద్రమాన సంవత్సరానికి సౌరమాన సంవత్సరానికి ఉన్న తేడాను సరిచేసేందుకు చాంద్రమాన సంవత్సరంలో ఒక నెల అధికంగా జోడించి అధిక మాసమని అంటారు..

ఇలా ఈ అధిక మాసము శూన్యమాసమైనందున శుభకార్యాలు ఆచరించడానికి నిషిద్ధము. అధికమాసంలో వివాహము, ఉపనయనము, గర్భాదానం, గృహారంభం, గృహప్రవేశం వంటివి నిషేధించారు. అధికమాసంలో ఎలాంటి శుభకార్యాలను ఆచరించకూడదు. పితృ కార్యాలను కూడా అధికమాసాన్ని వదిలేసి నిజమాసంలోనే ఆచరించవలెను.

అధిక మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు
18 జూలై 2023 మంగళవారం నుంచి 16 ఆగస్టు 2023 బుధవారం వరకు అధిక శ్రావణ మాసం అవుతుంది.. ఇక నిజ శ్రావణం 17 ఆగస్టు 2023 గురువారం నుంచి 15 సెప్టెంబరు 2023 వరకు ఉంది.. అధిక మాసం శూన్య మాసం. భగవత్ సాక్షాత్కారాానికి సంబంధించిన కార్యక్రమాలు, పుణ్యార్చన సంపాదించే కార్యాల ఆచరించవచ్చు. అనగా హోమాలు, విష్ణుసహస్రనామ పారాయణం, అష్టాదశ పురాణాలు, మహాభారత పఠనం, రామాయణ పఠనం వంటివి చేయవచ్చు.

అధిక మాసంలో ఆచరించవలసినవి
దైవారాధనలు, వ్రతాలు, పితృ ఆరాధన, అధికమాస పూజ, దానధర్మాలు వంటివి ఆచరించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి.. పురాణాల ప్రకారం అధిక మాసానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన విశేషమున్నది. మహావిష్ణువుకు చాలా ప్రత్యేకమైనటువంటి మాసం అధిక మాసము. మహావిష్ణువు అధికమాసానికి పురుషోత్తమ మాసమని పేరు ఇచ్చినట్లుగా చెప్పబడినది.

విష్ణుమూర్తి అధికమాస మహాత్యాన్ని చెబుతూ ఈ మాసంలో చేసేటటువంటి మంచి పనులకు అధికమైన ఫలితాలు వస్తాయని అందుకనే ఈ మాసానికి అధికమాసమని పేరు. అందువలన అధిక మాసంలో విష్ణుమూర్తిని ఆరాధించడం, విష్ణు సహస్ర నామాలు పఠించడం ఏకాదశి రోజు ఉపవాసము వ్రతాలు దీక్షలు వంటివి చేయడం వల్ల మామూలు మాసముల కన్న అధికమైన ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

అనాథలకు మూగ జీవాలకు ఆహారాన్ని అందించడం, దానధర్మాలు ఆచరించడం వల్ల మామూలు మాసంలో చేసేటివంటి వాటి కంటే అధికమైన ఫలితం పురుషోత్తమమైన మాసం అయినటువంటి అధికమాసంలో లభిస్తుంది..

పూర్వం ఇంద్రుడు అధిక మాస వ్రతాన్ని ఆచరించి ఇంద్ర పదవిని పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఒకానొకప్పుడు లక్ష్మీదేవి స్వయముగా అధికమాస మహిమ గురించి మహావిష్ణువును అడుగగా మహావిష్ణువు ఈ అధిక మాసమైనటువంటి పురుషోత్తమ మాసములో ఎవరైతే పుణ్య నదీ స్నానాలు జప హోమాలు, దానాలు వంటివి ఆచరిస్తారో వారికి మామూలు మాసంలో వచ్చేటటువంటి ఫలితాలు కన్నా అధిక రెట్ల ఫలితాలు వస్తాయని చెప్పారు.

ఇదియే కాకుండా ఇలాంటి అధిక మాసంలో గనుక పుణ్యకర్మలు ఆచరించకపోతే వారి జీవితంలో కష్టనష్టములు ఎదురవుతాయని పెద్దలు చెబుతారు. అధికమాసంలో శుక్ల పక్షమునందు గాని కృష్ణపక్షమునందు గాని అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజున కనీసము ఈ పుణ్యకార్యాలు ఆచరించినట్లు అయితే వారికి అధిక మాస పుణ్య ఫలము లభిస్తుందని విష్ణుమూర్తి స్వయంగా లక్ష్మీదేవికి చెప్పినట్లుగా పురాణాలు తెలిపాయి..

నిజ శ్రావణ మాస తేదీలు,,
నిజ శ్రావణ మాసం 17 ఆగస్టు 2023 గురువారం నుంచి 15 సెప్టెంబరు 2023 వరకు ఉంది.. శ్రావణ సోమవార శివారాధన, మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మీ పూజలు, నాగ పంచమి, పుత్రద ఏకాదశి, జంద్యాల పూర్ణిమ (శ్రావణ పూర్ణిమ) వంటి పండగలన్నీ కూడా నిజ శ్రావణ మాసంలో 17 ఆగస్టు 2023 నుంచి 15 సెప్టెంబరు 2023 మధ్య జరుపుకోవాలి..

🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

ఇంక్రిమెంట్లు-రకాలు

*🔥ఇంక్రిమెంట్లు-రకాలు* 

 *🍁ఒక సంవత్సర కాలము పాటు సంతృప్తికరంగా సేవలందించిన ఉద్యోగికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని వార్షిక ఇంక్రిమెంట్లు అందురు.*

 *👉ఒక ఉద్యోగిపై ఆరోపణలు చార్జిషిటు పెండింగ్ లో ఉంటే తప్ప ఆ ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంటు నిలపరాదు.*

 *🍁APFC లోని ఫారం-49 లో డ్రాయింగ్ అధికారి ఇంక్రిమెంట్ ధృవపత్రంపై సంతకం చేసి వేతన బిల్లుకు జతపరచకపోతే ,ప్రభుత్వ ఉద్యోగికి ఇంక్రిమెంటు చెల్లించరు.*
*(G.O.Ms.No.212 Fin Dt:16-05-1961)*

 *👉నెల మధ్యలో ఇంక్రిమెంట్ తేది ఉంటే అదే నెల మొదటి తేదికి మార్చబడుతుంది.*
*(G.O.Ms.No.133 Fin Dt:13-05-1974)*
*(G.O.Ms.No.546 Edn Dt:05-07-1974)*

 *🔥DSE ఉత్తర్వులు 3781/74 Dt:13-22-1974 ప్రకారం దండన క్రింద ఇంక్రిమెంట్లను నిలిపివేసిన కేసులలో ఇంక్రిమెంట్లు దండన సమాప్తమైన తేది నుండి మంజూరు చేయబడతాయి/పునరుద్ద రించబడతాయి.*

 *👉ఉద్యోగి సెలవులో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్లు మంజూరు చేయరాదు. డ్యూటీలో చేరిన తరువాతే మంజూరు చేయాలి.*
*(Memo.No.49463 Dt:06-10-1974)*

 *🍁ఉద్యోగి మొదటి వార్షిక  ఇంక్రిమెంట్ 12 నెలలు పూర్తికాకుండానే మంజూరు చేయబడుతుంది.*

📝Eg: *ఒక ఉద్యోగ నియామక తేది 28-12-2012 సదరు ఉద్యోగి మొదటి ఇంక్రిమెంట్ 01-12-2013 న మంజూరు అవుతుంది.*

 *👉నెల ఆఖరి రోజు సాయంత్రం నూతనంగా సర్వీసులో చేరినవారు తరువాత నెల మొదటి తేది నుండి జీతమునకు అర్హులు.జీతం తీసుకున్న నెలయే ఇంక్రిమెంట్ తేది అవుతుంది.*

 *🍁వార్షిక ఇంక్రిమెంట్ కు లెక్కించబడిన కాలమే అప్రయత్న పదోన్నతి పథకం(AAS) స్కేళ్ళ మంజూరుకు పరిగణించబడుతుంది.*

   *🍁ఇంక్రిమెంట్ కు పరిగణింపబడు కాలము* 

 *👉ఒక వేతన స్కేలు లో ఉద్యోగి చేసిన డ్యూటీ కాలం.*

 *అన్ని రకాల సెలవులు (జీత నష్టపు సెలవు తప్ప)*

 *🍁డిప్యూటేషన్ పై పనిచేసిన కాలము.*

 *👉అనుమతించబడిన మేరకు జాయినింగ్ కాలం.*

*🍁పై పోస్టులో గడిపిన కాలం క్రింది పోస్టులో ఇంక్రిమెంట్ కు పరిగణించబడుతుంది.*

 *🍁ప్రభుత్వ సెలవులు మరియు వెకేషన్ కాలం.*

*ఉద్యోగం చేస్తూ పొందిన శిక్షణా కాలం (డ్యూటీ గా పరిగణించబడి నప్పుడు మాత్రమే)*

   *🍁ఇంక్రిమెంటునకు పరిగణింపబడని కాలం* 

*👉జీతనష్టపు సెలవు ఇంక్రిమెంట్ కు పరిగణించబడదు. సదరు సెలవు వాడుకున్న రోజులు ఇంక్రిమెంటు వాయిదా పడుతుంది.*

 *🍁జీతనష్టపు సెలవు వాడు కొన్నానూ ఇంక్రిమెంటు వాయిదా పడని సందర్భము:*

 *👉వైద్య కారణాలపై,శాస్త్ర,సాంకేతిక ఉన్నత విద్యకై ఇంకా ఉద్యోగ పరిధిలో లేని కారణాలపై జీతనష్టపు సెలవు వాడుకొన్ననూ 6 నెలల వరకు సెలవు కాలాన్ని ఇంక్రిమెంటుకు లెక్కించు అధికారం ప్రభుత్వ శాఖాధిపతులకు ఇచ్చింది* *(ఉపాధ్యాయుల విషయంలో కమిషనర్ మరియు విద్యా సంచాలకుల వారు) (FR-26(2)) & G.O.Ms.No.43 F&P Dt:05-02-1976)*

 *👉6 నెలల కంటే ఎక్కువ జీతనష్టపు సెలవు వాడుకున్న సందర్భాలలో ప్రభుత్వానికి అప్పీలు చేసుకోవాలి.*

   *🍁ఇంక్రిమెంట్లు నిలుపుదల సందర్భాలు:* 

*👉తప్పుడు ప్రవర్తనా , విధి నిర్వహణలో అలక్ష్యం కారణంగా క్రమశిక్షణా చర్యగా ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంట్లు 2 రకాలుగా నిలుపుదల చేయవచ్చును.*

 *🍁Without Cumulative Effect:*

*👉FR-24(1) ప్రకారం కేవలం ఒక సం॥ మాత్రమే నిలుపుదల చేసి తదుపరి ఇంక్రిమెంట్ తేది నాడు విడుదలచేస్తారు. అంటే సదరు ఉద్యోగి ఒక సం॥ పాటు లేదా అంతకన్నా తక్కువ కాలం ఏరియర్స్ పోగొట్టుకుంటారు.*

*🍁With Cumulative Effect:*

*👉దీన్ని అమలుచేసే ముందు విచారణాధికారిని నియమించాలి. సదరు ఉద్యోగి తన వాదనను వినిపించేoదుకు అవకాశం ఇవ్వాలి. ఉద్యోగికి చార్జిషిటు అందించడమే కాకుండా ఏ సాక్ష్యాధారాల ప్రకారం ఉద్యోగిపై ఆరోపణ చేయబడినదో కూడా అందించాలి. ఈ శిక్ష ప్రకారం ఉద్యోగి శాశ్వతంగా ఇంక్రిమెంటు కోల్పోతాడు.*

52 అక్షరాలు ( అ నుంచి ఱ వరకు) తో కథ

52 అక్షరాలు ( అ నుంచి ఱ వరకు) తో కథ ఎవరు రాశారో తెలిస్తే బావుండును.. వాట్సాప్ షేర్. 
చదవండి. భలే ఉంది. 

        (అ)మ్మ చేతి గోరుముద్దలు తినిన పిల్లలు
        (ఆ)నందంగా పాఠశాలకు వెళ్లబోతూ,
        (ఇ)ళ్లలోంచి బయట పడుతూనే
        (ఈ)లల గోలల మోతలతో, 
        (ఉ)రుకులు పరుగులతో హడావుడిగా వెళ్లి, బడిలో
        (ఊ)యల, ఉడతల కథలు హాయిగా వింటారు.
        (ఋ)ణ, సంబంధ ఇక్కట్లు తెలియక
        (ౠ) అని తమాషాగా దీర్ఘం తీసుకుంటూ,
        (ఎ)ఱుపు, నలుపు, పసుపు,తెలుపు రంగులు కల
        (ఏ)డు రంగులు కలబోసిన సీతాకోకచిలుకల్లాగా,
        (ఐ)దారుగురు ఆడ,మగ స్నేహితులు కలిసి సరదాగా
        (ఒ)ప్పుల కుప్ప ఒయ్యారి భామా ఆటాడుకుంటూ,
        (ఓ)డల ఒంటెల కథలు ఒకరికొకరు చెప్పుకుంటూ,
        (ఔ)రా నువ్వెంత? నేనే బాగా చెప్పానని విఱ్ఱవీగుతూ, ఇలా
        (అం)దరూ ఎంతగానో సంతోషిస్తూ, ఆనందంగా
        (అః) అః అహహహా అంటూ ముద్దులొలికే నవ్వులతో ఇంటికి వచ్చేస్తారు.

        (క)డుపాత్రం ఎఱిగిన తల్లి అయ్యోపాపమంటూ, అతి ప్రేమగా
        (ఖ)ర్జూరపు పండ్లు నోటిలో దట్టించి పెట్టగా,
        (గ)బ గబా తినేసిన బుజ్జాయిలు, అలా తినిన
        (ఘ)నాహారం జీర్ణమయ్యే వఱకు ఆడుకుంటూ, ఆటల పాటలను
        (జ్ఞ)ప్తికి తెచ్చుకొని, నెమరేసుకుంటూ ఇంటికొచ్చి, తిని, నిద్దరోతారు.

మళ్లీ మరుసటి రోజు యథాప్రకారంగా, అమ్మ పిలుపుతో లేచి,........

        (చ)క చకా తయారై, పాఠశాలకు వెళ్లిపోయి, ప్రార్థన తర్వాత
        (ఛ)లో అనుకుంటూ తరగతుల్లోకి చేరుకోని, 
        (జ)తలు జతలుగా పిల్లలంతా కలసికట్టుగా వెళ్లి
        (ఝ)మ్మని ఎవరి సీట్లలో వాళ్లు సర్దుకొంటుండగా, మాస్టారొచ్చి
        (ఞ) అక్షరాన్ని వ్రాయమంటే, రాక, బిక్కమొహం వేస్తారు. 

        (ట)క్కుటమారు విద్యలనారితేరిన, టక్కరి తుంటరి పిల్లలు
        (ఠ)పీ, ఠపీమని బల్లలపై శబ్దాలు చేస్తుంటే,
        (డ)ప్పుల మోతల్ని మించిన శబ్దాలను విన్న మాస్టారు
        (ఢ)క్కాలు బద్దలు కొట్టినట్లుగా ఎవర్రా అది, అని అరుస్తూండగానే,
        (ణ)ణణణణణ ణ, ణ, ణ అని ఇంటి గంట మోగిన క్షణంలోనే...

        (త)లుపులు తోసేసుకుంటూ,
        (థ)పా థపా మనే శబ్దాలు చేసుకుంటూ,
        (ద)బ్బు దబ్బున తరగతిలోని పిల్లలందరూ
        (ధ)న ధనామంటూ కాళ్ల నడకల శబ్దాల ప్రతిధ్వనులతో 
        (న)లువైపులా పరికిస్తూ, గుడి లాంటి బడి గడప దాటిన పిల్లలు,

        (ప)రుగు పరుగున కొందరు,
        (ఫ)స్టు నేనంటే నేనని పోటీపడుతూ ఇంకొందరు, 
        (బ)యటకు పూర్తిగా వచ్చేసి,
        (భ)లే భలే, ఎవరు ఇళ్లకు ముందుగా చెరుతారని పందెంతో కొందరు,
        (మ)న స్కూలు, 'చాలా మంచి స్కూలబ్బా' అని, ఇంకొందరు,

        (య)థాలాపంగా, ఏ హావభావాలూ లేకుండా కొందరు,
        (ర)య్ రయ్ మంటూ పిచ్చి శబ్దాలతో ఇంకొందరు,
        (ల)గెత్తుకొని, తోటి పిల్లలను తోసేసుకుంటూ,
        (వ)చ్చి పోయే వ్యక్తులను ఓర కంటితో చూస్తూ, దారిపై వచ్చిపోయే
        (శ)కటములను తమాషాగా తప్పించుకుంటూంటే,
        (ష)రా మామూలే, 'వీళ్లెప్పుడూ మారర్రా' అని కొందరనుకుంటుండగా,
        (స)రదాగా అల్లరి చేసుకుంటూ, ఆనందంతో
        (హ)ర్షాతిరేకాలు మిన్ను ముట్టగా, గందరగో-
        (ళ) కోలాహల కలకలాతో రేపు ఆదివారం, సెలవు అనుకుంటూ
        (క్ష)ణాలలో వారి వారి ఇళ్లకంతా, మన కొ-
        (ఱ)కరాని కొయ్యలందరూ తల్లుల ఒడిలోకి చేరి తరిస్తారు.

ఇలా, తమాషాగా 'అఆ ఇఈ లతో, కఖ గఘ లతో' అందమైన ఒక సంఘటనను వర్ణించి చెప్పుకొని ఆనందించవచ్చు. ఇది చదివిన ఉత్సాహవంతులు, భాష మీది 
అభిమానంతో, తెలుగు భాష మీది పట్టుతో, అచ్చులతో హల్లులతో ఇంకా ఎన్నెన్నో అర్థవంతమైన, అందమైన కథలను, సంఘటనలను సృష్టించుకొని, వారి ప్రతిభకు సాన పెట్టవచ్చు. అలాగే, మీ మీ పిల్లలకు ఇలా వ్రాయలని మార్గ దర్శకులు కావచ్చు.

అతి సుందరమైన, సుమధురమైన, సౌమ్యమైన, కమ్మదనం కలబోసిన, తేట తేట తెలుగును, మృదుత్వంతో కూడిన తెలుగునే మాట్లాడండి. తెలుగులోనే వ్రాయండి. తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి. తేనె లొలుకు తెలుగు తియ్యందనాన్ని తనివితీరా జుఱ్ఱుకొని, మనస్పూర్తిగా ఆస్వాదించండి, ఆస్వాదింపజేయండి.

ఉత్పత్తి కులాల దిక్సూచి 'ది శూద్రాస్"

ఉత్పత్తి కులాల దిక్సూచి 'ది శూద్రాస్"
                   వేల సంవత్సరాలుగా భారత సామాజిక వ్యవస్థలో కొన్ని వర్గాలు మరికొన్ని వర్గాల మీద నిరంతరాయంగా ఆధిపత్యాన్ని వహించడం అసమానతలను ప్రస్పూటకరించడమే అవుతుంది. ఈ సామాజిక అసమానతలను ధిక్కరించడం దీర్ఘకాలం సంభవించే ప్రక్రియ. తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న శూద్రులను విముక్తి చేసే పోరాటంలో జ్యోతిభాపూలె ఏకంగా వర్ణ వ్యవస్థనే  ధిక్కరించాడు. ఆయన అడుగుజాడలల్లో నడిచిన అంబేడ్కర్ సైతం సామాజిక అసమానతలను ప్రశ్నించాడు. అంబేడ్కర్ అనంతరం బ్రాహ్మణీయ హిందూ వ్యవస్థ దాష్ఠికాల మీద తన కలం ఎక్కుపెట్టిన సామాజిక, రాజకీయ తత్వవేత ప్రొఫెసర్ కంచ ఐలయ్య, జే ఎన్ యూ పరిశోధక విద్యార్థి కార్తిక్ రాజా కరిప్పుసామి సంపాదకీయంలో వెలువడిన పుస్తకం 'ది శూద్రాస్: విజన్ ఫర్ ఎ న్యూ పాత్".  ఆధునిక కాలంలో సైతం కులం, మతం పేరిట సమాజాన్ని విడదీస్తున్న అభివృద్ది నిరోధక శక్తుల అరాచకత్వంపై ఎక్కుపెట్టిన అస్త్రమిది. ముందస్తు పరిచయ  వ్యాసంతో కలిపి పన్నెండు వ్యాసాలున్న ఈ పుస్తకం ఆధ్యాంతం ఆలోచింప జేసే విధంగా భారత సమాజంలో శూద్రుల వెనకబాటు తనంతో పాటు, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత పరిస్థితులను భిన్న కోణంలో మన ముందుంచుతుంది. దేశాన్ని పట్టి పీడిస్తున్న విభిన్న సమస్యల గురించి ఈ పుస్తకంలోని వ్యాసాలు పాఠకులకు అవగాహన కల్పించడంతో పాటు, శూద్ర సమస్యను ఆధునికవాద విధానంతో దేశం ముందు ఉంచాయి. చారిత్రాత్మకంగా నాగరికత ప్రాతిపదికన నిర్మించిన అనేక ఉత్పాదక కులాలు శూద్ర వర్గంలో భాగమే. అయినప్పటికీ బ్రాహ్మణీయ క్రమంలో శక్తి, జ్ఞానం పంచుకునే అమరిక పరంగా ఈ వర్గం అట్టడుగు స్థానంలో ఉంది. వ్యవసాయ ఆధిపత్య కులాలు, వెనుకబడిన కులాలు, ఇతర వెనుకబడిన కులాలు, చాలా వెనుకబడిన కులాలు వంటి అనేక పేర్లతో ఈ వర్గం పిలవబడుతోంది.  కులవ్యవస్థ భావజాలం సమానత్వ సమాజం అనే భావనకు ప్రాథమికంగా విరుద్ధమని, అటువంటి సమాజ సాక్షాత్కారం స్వభావం, పరిస్థితులు పరిమితుల నుండి ఉత్పన్నమవుతుందని "హోమో హైరార్కికస్" పుస్తకంలో లూయీ డ్యుమాంట్ పేర్కొన్నాడు. కుల వ్యవస్థను 'సామాజిక స్తరీకరణ'కు రూపంగా మాత్రమే అర్థం చేసుకోవడానికి మనల్ని మనం పరిమితం చేసుకోలేమని ఆయన స్పష్టం చేశాడు.
                బాబాసాహెబ్ అంబేడ్కర్ 1946లో మొదటిసారిగా 'శూద్రులు ఎవరు" ? అనే పేరుతో ప్రచురించిన పుస్తకం శూద్రుల అస్థిత్వంపై మొదటిసారిగా స్పూర్తిధాయక ప్రశ్నలను సంధించింది. ఇన్నేళ్ళ తరువాత "ది శూద్రాస్" దళిత బహుజనులలో అదేరకమైన స్పూర్తిని రగిలిస్తోంది. వేద కాలంలో పట్టణ నాగరికత లేదు. ఈ కాలంలో మతసంబంధమైన ఆర్థిక వ్యవస్థ సమాజాన్ని శ్రేణీకృత వర్ణాలుగా విభజించింది. శూద్రులు వ్యవసాయదారులు, పశువుల పెంపకందారులుగా, వైశ్యులు పర్యవేక్షకులుగా కనిపిస్తారు. బ్రాహ్మణులు, క్షత్రియులు కూడా ఉత్పత్తి సంబందిత వ్యాపకలకు, వ్యవసాయ, పశువుల పెంపకం పనులకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఏదేమైనా, ద్విజా (రెండుసార్లు జన్మించిన) కులాలు అని పిలువబడే ఈ మూడు కులాలు హిందూ మతంలో అనేక హక్కులను పంచుకున్నాయి. హిందూ సమాజంలో శూద్రులకు ప్రాథమిక హక్కులు లేనప్పటికినీ, వారిని అదే మతానికి చెందినవారని ద్విజులు ప్రకటించారు.  అదేసమయంలో వారికి ఆధ్యాత్మిక పౌరసత్వం, దాని తాత్విక ఉపన్యాసంలో స్థానాన్ని నిరాకరించారు. పార్లమెంట్ సభ్యుడు శరద్ యాదవ్, సామాజిక కార్యకర్త సునీల్ సర్దార్, న్యాయ నిపుణులు బిందూ దొడ్డహట్టి, జామియా మిలియా ఇస్లామియా ప్రొఫెసర్ అరవింద్ కుమార్, జే ఎన్యూ రీసర్చ్ స్కాలర్ ఓం ప్రకాశ్ మహతో, సామజిక కార్యకర్త ప్రాచీ పాటిల్, జర్నలిస్ట్ ఉర్మిలేశ్, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రాం షేఫర్డ్ భీనవేణి, సీనియర్ వైద్య నిపుణుడు వినయ్ కుమార్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థి పల్లికొండ మణికంఠ వంటి శూద్ర నేపథ్య వ్యాసకర్తలు అందించిన వ్యాసాలు ఈ పుస్తకం ఉద్దేశానికి బలాన్నందించాయి. చరిత్ర వివిధ దశలలో శూద్రుల పరిస్థితిని వివరించడానికి సరైన అధ్యయనాలు లేవు. ఈ వ్యాసాలలో వారి సమకాలీన స్థితిగతులు.., మరీ ముఖ్యంగా భారతీయ సమాజంలో వారి స్థానాన్ని చర్చించారు. ప్రస్తుతం శూద్రుల పరిస్థితి దుర్భరంగా ఉన్నదని, శూద్ర విముక్తే ప్రధాన లక్ష్యంగా భవిష్యత్తులో శూద్ర విప్లవ ఆవశ్యకతను ఈ పుస్తకం స్పష్టం చేస్తుంది.
               ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలంలోనూ శూద్రులపై జరుగుతున్న అత్యాచారాలకు అంతు లేకుండా పోయింది. ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వ సాధన కోసం శూద్రులు చేయవలసిన పోరాటాల ఆవశ్యకతను ఈ పుస్తకం వివరిస్తుంది. నిరాధరణకు గురైన శూద్ర సంస్కృతి, సాంప్రదాయాల పునరుజ్జీవనాన్ని ప్రోత్సహించవలసిన అవసరాన్ని నొక్కిచెప్పింది. శూద్రులకు దేశ విదేశాలలో కూడా ఎటువంటి స్నేహసంబంధాలు లేనందున వారి అస్థిత్వ పోరాటం వారే చేయాలి. వైధిక ధర్మం శూద్రులను కేవలం ఉత్పాధక కార్యక్రమాలకే పరిమితం చేసి పేదరికాన్ని, బలవంతపు బానిసత్వాన్ని అనాధిగా అంటగడుతూనే ఉంది. బ్రాహ్మణియ వర్గీకరణ ప్రకారం, అంటరానివారితో సహా శూద్రులనబడే అన్ని ఉత్పాదక కులాలు శ్రమించేందుకే ఉద్దేశించబడినవి. కానీ ఈ ఉత్పాదకత ఫలాలను మాత్రం ద్విజా కులాలు స్వాధీనం చేసుకున్నాయి. కౌటిల్యుని అర్థశాస్త్రం ఈ దోపిడీ వ్యవస్థ తొలి క్రమబద్ధమైన చరిత్రను అందించింది. ద్విజులు ఉత్పాదక శ్రమకు దూరంగా ఉండటానికి, శూద్రుల ఖర్చుతో సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించడానికి అర్థశాస్త్రం సైద్ధాంతిక పునాది వేసింది.  అన్ని రకాల శ్రమతో కూడిన పనులను చేయడం ద్వారా ద్విజ వర్ణాలకు సేవ చేయడమే శూద్రుల ఏకైక విధి అని మనువు తెలివిగా ఆదేశించాడు. ఈ అన్యాయం అనాధిగా కొనసాగుతూ ఆదర్శవంతమైన వర్ణశ్రమధర్మంగా కొనియాడబడుతోంది. ద్విజులు సంస్కృతం, వేదాల అధ్యయనాలను ఇంకా తమ ఆధీనంలో ఉంచుకుంటూనే శూద్రులను హింసాత్మక వివక్షకు గురి చేస్తున్నారు. ఆధిపత్య కులాలుగా భావించబడే ఎగువ శూద్రులైన జాట్లు, గుజ్జర్లు, పటేల్స్, యాదవులు, మరాఠాలు, నాయరా, రెడ్డిలు, కమ్మలు, గౌండర్లు, లింగాయత్‌లు తమ మోధో స్పృహను మరిచి మనువాద రాజకియాలకు బలైతే శూద్రుల పరిస్థితి మరింత దారుణంగా మారడం ఖాయమని ఈ పుస్తకం హెచ్చరిస్తోంది.
                     ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్న జ్యోతిభాపూలే శూద్రులు, అతిశూద్రుల మీద షేఠ్ జీ - భట్ జీ(బ్రాహ్మణ-బనియా)ల సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక ఆధిపత్యాన్ని నిరసించాడు. దక్షిణాదిన పెరియార్ రామస్వామి, అయోతి దాస్ లు బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాలు భవిష్యత్తులో శూద్ర అస్థిత్వా పోరాటాలకు స్పూర్తిదాయకమయ్యాయి. స్వాతంత్రానికి ముందు నుంచే పశ్చిమ, దక్షిణ భారత దేశంలో బ్రాహ్మణాధిపత్యాన్ని నిరసిస్తూ అనేక అస్థిత్వ ఉద్యమాలు మొదలు కావడం సదరు ప్రాంతాల ఆత్మ గౌరవానికి నిదర్శనం. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాది పార్టీ, రాష్ట్రీయ జనతాదల్ పార్టీల ఆవిర్భావానికి ముందు హిందీ మాట్లాడే ఉత్తర, తూర్పు భారతంలో ఈ అస్థిత్వ పోరాటాలు తక్కువే అని చెప్పవచ్చు. విద్య, ఉపాధి పరంగా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోగా, కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. కాంగ్రెస్,బిజేపి రెండింటి పాలనలోనూ రిజర్వేషన్ల అమలు పట్ల స్పష్టమైన చర్యలు  లేకపోవడం దీనికి నిదర్శనం. 'కులరహిత' సమాజ ద్యేయంగా ప్రకటనలు గుప్పించిన భారతదేశ ఆధునిక ద్విజ సమాజం మండల్ కమిషన్ ప్రకటన సందర్భంగా తీవ్ర ఒత్తిడికి గురైంది. మండల్ కు వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం తీసుకు రావడం ఈ ఒత్తిడి ఫలితమే. రాబోయే ప్రమాదాన్ని దళిత, ఆదివాసీలు తెలివిగా అర్థం చేసుకున్నప్పటికీ, శూద్ర ప్రాంతీయ పార్టీ నాయకులు, క్యాడర్లతో సహా చాలా మంది శూద్రులు అర్థం చేసుకోలేదు. చాలా విషాదకరంగా, ఆధునిక భారతీయ చరిత్రలో ఉన్నత కుల ముస్లిం మేధావులు కూడా కులం, ఆధ్యాత్మిక ద్విజుల గురించి వ్రాయలేదు. ఇదేసమయంలో ఫులే-అంబేద్కర్ భావజాలం ప్రజాస్వామ్య, రాజ్యాంగ రూపాల పోరాటాలకు నిబద్ధతను కలిగి, అన్ని రకాల వ్యవస్థీకృత హింసపై పోరాటం చేస్తుంది. శూద్రులలో విద్యాధికులు కూడా తమను తాము శూద్రులుగా చెప్పుకోవడానికి ఇష్టపడక పోవడం విషాధం. తమ శూద్ర అస్థిత్వమే తమ పాలిట శాపంలా పరిణమించి విద్య, ఉద్యోగావకాశాల మీద ప్రతికూల ప్రభావం చూపుతుందేమోనని వారి భయం. శూద్రులు, దళిత, ఆదివాసులు తమ అభ్యున్నతి కోసం లౌకిక, ప్రగతిశీల, ప్రజాస్వామ్య పాఠ్యాంశాలతో ప్రాంతీయ భాషలను నేర్చుకోవడంతో పాటు, ఆంగ్ల మాధ్యమంలో ఉన్నత విద్య చదవవలసిన ఆవశ్యకత ఉంది. శూద్రులకు ఆంగ్ల విద్య నేర్చుకోవడానికి పెద్దగా సదుపాయాలు, వనరులు లేవు. కొంతవరకు చారిత్రక ప్రతికూలత, మరికొంతవరకు ఉన్నత విద్యలో మండల్ కమిషన్ యొక్క సిఫారసులను పూర్తి స్థాయి అమలుపరుచకపోవడం కూడా కారణమేనని వ్యాసకర్తల అభిప్రాయం. ఆధిపత్య నియంతృత్వాలను ఎదిరించడంలోనే శూద్రుల అస్థిత్వం ఆధారపడి ఉందనే వాస్తవాన్ని ఈ పుస్తకం లోతుగా విశ్లేషించింది.  
                                                                                  #జయప్రకాశ్_అంకం...

శాసనాలు

🔥శాసనాలు::

🔥నానాఘాట్ శాసనం-దేవి నాగానికా

🔥హథిగుంపా శాసనం-ఖారవేలుడు

🔥నాసిక్ శాసనం - గౌతమీ బాలశ్రీ

🔥అమరావతి శాసనం-రెండవ పులోమావి

🔥జునాఘడ్ శాసనం - శక రుద్రదాముడు

🔥భట్టిప్రోలు నిగమసభశాసనం- కుబేరుడు

🔥మ్యాకదోని శాసనం-
మూడవపులోమావి

🔥ఎర్రగడి శాసనం-. అశోకుడు

🔥రాజులమందగరి శాసనం-అశోకుడు

🔥గుమ్మడి దర్రుశాసనం-
ఎహుబల శాంతమూలడు

🔥మంచికల్లు శాసనం-
రుద్రపురుష దత్తుడు

🔥అల్లూరి శాసనం-
వీరపురుషదత్తుడు

🔥కొండముదితామ్ర శాసనం-
జయవర్మ 

🔥పెదవేగి శాసనం-రెండవ నందివర్మ

🔥కొల్లేరు శాసనం-రెండవ నందివర్మ

🔥మట్టిపాడు శాసనం-దామోదరవర్మ

🔥గోరెంట్ల శాసనం-అత్తివర్మ

🔥తుమ్మలగూడెం శాసనం-గోవిందవర్మ

🔥ఈవూరు శాసనం-మాదవవర్మ

🔥రామతీర్థం శాసనం-ఇంద్రవర్మ

🔥మైదవోలు తామ్రశాసనం- శివస్కందవర్మ

🔥కొడాలి శాసనం-విజయస్కందవర్మ

🔥పొట్లదుర్తి శాసనం- పుణ్యకుమారుడు

🔥విప్పర్లశాసరం-
మొదటి జయసింహవల్లభుడు

🔥అద్దంకి శాసనం-
పాండురంగడు

🔥చీపురుపల్లి శాసనం-
కుబ్జవిష్ణువర్థనుడు

🔥సతారా శాసనం-
రెండవ పులకేసి

🔥మాగల్లు శాసనం-
దానార్ణవుడు

🔥బయ్యారం శాసనం-మైలాంబ

🔥ఖాజీపేట శాసనం-
రెండవ బేతరాజు

🔥ఖాజీపేట దుర్గ శాసనం-
దుర్గరాజు

🔥హన్మకొండ శాసనం-
రుద్రదేవుడు

🔥మోటుపల్లి శాసనం-
గణపతి దేవుడు

🔥బీదరుకోట శాసనం-
రేచర్ల ప్రసాదిత్యుడు

🔥తేరాల శాసనం-
ప్రతాప రుద్రుడు

🔥మట్టివాడ శాసనం-
గణపతి దేవుడు

🔥విలాస తామ్రశాసనం-
ముసునూరి ప్రోలయనాయకుడు

🔥నెల్లూరి శాసనం-
మొదటి హారిహరరాయులు

🔥బిట్రగుంట శాసనం-
మొదటి బుక్కరాయలు

🔥మోటుపల్లి దానశాసనం-
మొదటి దేవరాయలు

🔥హంపీశాసనం , కొండవీడు‌,మంగళగిరి, పొట్నూరు,ఉదయగిరి శాసనాలు-
శ్రీ కృష్ణ దేవరాయలు


ఉపాధ్యాయుల బదిలీలు - పదోన్నతుల షెడ్యూల్ విడుదల

ఉపాధ్యాయుల బదిలీలు - పదోన్నతుల షెడ్యూల్ విడుదల

 •  *జనవరి 27 నుండి మార్చి 4 వరకు కొనసాగింపు.*

 •  *వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా పదోన్నతులు.*

*ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బదిలీలు, పదోన్నతుల కల్పనకు ఎట్టకేలకు కాలపట్టిక విడదలైంది. ఈ జాతర ఈనెల 27 నుండి మార్చి 4 వరకు కొనసాగుతుంది.*

 •  *జనవరి 27న అన్ని క్యాటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్లైన్ లో ప్రకటిస్తారు.* 

 •  *జనవరి 28 నుండి 30 వరకు బదిలీ దరఖాస్తులు ఆన్లైన్ లో స్వీకరిస్తారు.*

 •  *దరఖాస్తు హార్డ్ కాపీలను హైస్కూల్ ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత ఎంఈఓలకు, మండల పరిషత్ పిఎస్, యుపిఎస్ ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డిఈఓ కు జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 లోపు సమర్పించాలి.*

 •  *దరఖాస్తుల హార్డ్ కాపీలను సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు డిఈఓ కార్యాలయంలో సమర్పించడం, పరిశీలన, ఆన్లైన్ లో ఆమోదించటం ఫిబ్రవరి 3 నుండి 6 వరకు*

 •  *ఫిబ్రవరి 7న డిఈఓ/ ఆర్జేడీ వెబ్ సైట్లలో బదిలీ పాయింట్లతో ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాలు మరియు పదోన్నతుల సీనియారిటీ జాబితాల ప్రకటన*

 •  *ఫిబ్రవరి 8 నుండి 10 వరకు మూడు రోజులు అభ్యంతరాల స్వీకరణ పరిశీలన, పరిష్కారం.*

 •  *తుది సీనియారిటీ జాబితాల ప్రకటన మరియు ప్రధానోపాధ్యాయులు బదిలీలకు వెబ్ ఆప్షన్ల నమోదు ఫిబ్రవరి 11,12 తేదీలు.*

 •   *మల్టీ జోనల్ స్థాయిలో* *ప్రధానోపాధ్యాయులు వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, పునః పరిశీలన ఫిబ్రవరి 13.*

 •  *ఫిబ్రవరి 14న ఆర్జేడీలచే ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల విడుదల.*

 •  *ఫిబ్రవరి 15న బదిలీల అనంతరం మిగిలిన ఖాళీల ప్రకటన.*

 •  *ఫిబ్రవరి 16,17,18 తేదీల్లో అర్హత గలిగిన స్కూల్ అసిస్టెంట్స్ కు ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పదోన్నతుల కౌన్సెలింగ్.*

 •  *ఫిబ్రవరి 19, 20 తేదీల్లో సబ్జెక్ట్ వారీగా స్కూల్ అసిస్టెంట్స్ ఖాళీల ప్రకటన మరియు బదిలీ ఆప్షన్స్ నమోదు.*

 •  *ఫిబ్రవరి 21 న ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలనకు అవకాశం*

 •  *ఫిబ్రవరి 22,23 తేదీల్లో డిఈఓలచే స్కూల్ అసిస్టెంట్స్ బదిలీ ఉత్తర్వులు విడుదల.*

 •  *ఫిబ్రవరి 24 న స్కూల్ అసిస్టెంట్స్ బదిలీల అనంతరం ఏర్పడిన ఖాళీల ప్రకటన*

 •  *ఫిబ్రవరి 25,26,27 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు కోర్టు కేసులు లేని సబ్జెక్టులకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు.* 

 •  *ఫిబ్రవరి 28, మార్చి 1,2 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన పోస్టుల ఖాళీల ప్రకటన మరియు వెబ్ ఆప్షన్స్ నమోదు.*

 •  *మార్చి 3న ఆప్షన్ల సవరణ, పునః పరిశీలన*

 • *మార్చి 4న ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు విడుదల.*

 •  *మార్చి 5 నుండి 19 వరకు డిఈఓ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీల్స్, అభ్యంతరాలను ఆర్జేడీ కి, ఆర్జేడీ ఉత్తర్వులపై అప్పీల్స్/ అభ్యంతరాలను డియస్ఈ కి పంపుకోవాలి.*

*సంబంధిత అధికారులు 15 రోజుల్లో వాటిని పరిష్కరించాలి.*

టెన్త్ అర్హతతో కోర్టుల్లో ఉద్యోగాలు.. వేతనం గరిష్టంగా 58 వేలు

రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి హైకోర్టు ఒకేసారి ఆరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఎగ్జామినర్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, ప్రాసెస్‌ సర్వర్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ విభాగాల్లో మొత్తం 1,904 పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల11వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 31వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది.

ఫిబ్రవరి 15వ తేదీ నుంచి హాల్‌టికెట్లను వైబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మార్చిలో ఆయా పోస్టులకు కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్స్‌ నిర్వహిస్తారు. పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని హైకోర్టు రిజిస్ట్ట్రార్‌ తెలిపారు. ఖాళీల వివరాలు, రిజర్వేషన్లు, విద్యార్హతలు ఇతర పూర్తి వివరాలకు హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ http;//tshc.gov.in ను సందర్శించవచ్చు. అనుమానాలను నివృత్తి చేసుకొనేందుకు helpdesk-tshc@telangana.gov.in ఈ-మెయిల్‌లో సంప్రదించొచ్చు. 040- 23688394 నంబర్‌కు హైకోర్టు పని దినాల్లో ఫోన్‌ చేసి కూడా తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లలో పేరొన్నారు.

పిన్లండ్ విద్యా విధానం

ఆ దేశంలో ఏ పిల్లాడూ బడికెళ్లనని మారాం చేయడు. ఏ చిన్నారీ భుజాన పుస్తకాల సంచీతో ఆపసోపాలు పడుతూ కనిపించదు. యూనిఫాంలూ, హోం వర్కులూ, వార్షిక పరీక్షలూ, మార్కులూ, ర్యాంకుల బూచీలూ, రోజంతా సాగే స్కూళ్లూ, స్టడీ అవర్లూ, ట్యూషన్లూ... ఒక్కమాటలో చెప్పాలంటే విద్యార్థులకు కష్టం కలిగించే ఏ చిన్న విధానాన్నీ అనుసరించని ఏకైక దేశం #ఫిన్లాండ్‌. అయితేనేం, ప్రపంచంలోని అత్యద్భుతమైన విద్యావ్యవస్థల్లో ఆ దేశానిది నిలకడగా తొలిస్థానమే. అక్కడ ప్రతి విద్యార్థీ తరగతిలో టాపరే! పిల్లల్ని స్కూలుకి పంపించేముందు తల్లిదండ్రులూ, పాఠాలు మొదలుపెట్టే ముందు టీచర్లూ... ఫిన్లాండ్‌ వాసులు అనుసరిస్తోన్న పద్ధతుల్ని ఓసారి స్మరించుకోవడం మహా ఉత్తమం.

పదిలోపు వంద ర్యాంకులు, వందలోపు వెయ్యి ర్యాంకులు, వెయ్యిలోపు పదివేల ర్యాంకులు... మే, జూన్‌ నెలల్లో ఏ టీవీ ఛానల్‌ పెట్టినా అదే పనిగా ఈ అంకెల దండోరా చెవుల్ని హోరెత్తిస్తుంది. ఏ పత్రిక తిరగేసినా స్కూళ్లూ, కాలేజీల ప్రకటనలతో నిండుంటాయి. మంచి మార్కులొచ్చిన పిల్లలే పోటీ ప్రపంచానికి మనుషుల్లా కనిపిస్తారు. టాప్‌ ర్యాంకు వచ్చిన వాళ్లనే సమాజం నెత్తిన పెట్టుకుంటుంది. సచిన్‌లా బ్యాటింగ్‌ చేసే శక్తి ఉన్నా, రెహమాన్‌లా పియానో వాయించేంత టాలెంట్‌ సొంతమైనా, తరగతిలో మార్కులు రాకపోతే మాత్రం ఆ పిల్లాడు ఎందుకూ పనికిరాని మొద్దావతారమే! అందుకే మనదేశంలో చాలామంది చిన్నారులు ఆ అంకెల వేటలో పడి అందమైన బాల్యాన్ని కోల్పోతున్నారు. ఓ పది మార్కులు తగ్గితేనే మహా పాపం చేసినట్టు ప్రాణాలు తీసుకుంటున్న వాళ్లూ ఉన్నారు. తల్లిదండ్రుల ఆరాటం, విద్యా సంస్థల ఒత్తిడీ కలగలిసి ఇక్కడ విద్యార్థుల పరిస్థితిని దయనీయంగా మార్చేస్తున్నాయి. ఉత్తమ విద్యావ్యవస్థల జాబితాలో నానాటికీ మన స్థానం దిగజారుతూ వస్తోంది.

సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించినా మనలాంటి ఎన్నో దేశాలు సాధించలేని ఫలితాలను ప్రపంచంలో అత్యుత్తమ విద్యావ్యవస్థ కలిగిన దేశంగా పేరున్న ఫిన్లాండ్‌, ఆడుతూపాడుతూ అందుకుంటోంది. ఐరోపాలోని ఓ చిన్న దేశమైన ‘ఫిన్లాండ్‌’ విద్యార్థులపైన ఏ మాత్రం ఒత్తిడి పెట్టకుండానే వాళ్లను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దొచ్చని నిరూపిస్తోంది. పరీక్షలు, ర్యాంకుల ప్రస్తావన లేకుండానే వాళ్లను ఇంజినీర్లూ, డాక్టర్లూ, ఇతర వృత్తి నిపుణులుగా తయారు చేస్తోంది. అన్ని విషయాల్లో అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లండ్‌ లాంటి దేశాలకు కూడా, పిల్లల్ని చదివించే విషయంలో ఫిన్లాండ్‌ కొత్త పాఠాలు నేర్పిస్తోంది. ఏటా తన బోధనా పద్ధతుల్ని మార్చుకుంటూ, కొత్త ప్రమాణాల్ని అందుకుంటూ గత నలభై ఐదేళ్లలో అక్కడి విద్యావ్యవస్థ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తొంది. మూడేళ్లకోసారి అంతర్జాతీయంగా విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించే ‘ప్రోగ్రామ్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ ఎసెస్‌మెంట్‌’(పిసా) లెక్కల్లో అమెరికా, జపాన్‌, చైనా లాంటి దిగ్గజాలను దాటి ఆ చిట్టి దేశానికి చెందిన పిల్లలు వరసగా తొలి స్థానాన్ని సాధిస్తున్నారు. ప్రతి విద్యార్థీ కలలుగనే తరగతి గదులూ, ప్రతి పాఠశాలా అనుసరించాల్సిన విధానాలూ, అందరు తల్లిదండ్రులూ పాటించాల్సిన నియమాలూ ఫిన్లాండ్‌ సొంతం.

ఏడేళ్లకు స్కూలు... 
మన దేశంలో పిల్లలకు రెండేళ్లు దాటగానే తల్లిదండ్రులు స్కూళ్ల వేట మొదలుపెడతారు. బడిలో కాలు పెట్టకముందే అఆలూ, అంకెలూ బట్టీ కొట్టిస్తారు. కానీ ఫిన్లాండ్‌లో పిల్లలు స్కూల్లో అడుగుపెట్టాలంటే కనీసం ఏడేళ్లు నిండాల్సిందే. అప్పటివరకూ వాళ్లు పలకా బలపం, పుస్తకాలూ పెన్సిళ్లూ పట్టుకోరు. అలాగని నేర్చుకునే వయసునీ వృథా చేసుకోరు. డే కేర్‌ సెంటర్లలో ఉంటూ తమ మెదడుని పదును పెట్టుకునే పనిలో పడతారు. సాధారణంగా తొలి ఆరేళ్లలోనే పిల్లల మెదడు కణాలు 90శాతం విచ్చుకుంటాయి. దేన్నైనా త్వరగా గ్రహించే శక్తి పెరుగుతూ వస్తుంది. అన్ని దేశాల్లో ఆరేళ్లలోపు వయసులోనే పిల్లలకు లెక్కలు, సైన్స్‌ లాంటి అంశాలకు సంబంధించిన ప్రాథమిక విషయాలు బోధిస్తారు. ఫిన్లాండ్‌లో మాత్రం తొలి ఆరేళ్లలో పాఠాలకు బదులుగా, పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తారు. అందరితో కలిసి ఆడుకోవడం, పద్ధతిగా తినడం, నిద్రపోవడం, ఒకరికొకరు సహాయ పడటం, శుభ్రత పాటించడం, భావవ్యక్తీకరణ నైపుణ్యం, జాలీ, దయా, సామాజిక స్పృహ... ఇలాంటి అన్ని జీవన నైపుణ్యాలను అలవరచుకునేలా ప్రోత్సహిస్తారు. బడికి ఎప్పుడైనా వెళ్లొచ్చు, కానీ మంచి పౌరుడిగా ఎదగడానికి పునాది మాత్రం పసి వయసులోనే పడాలన్నది ఫిన్లాండ్‌ వాసుల నమ్మకం. అందుకే తొలి ఆరేళ్లను దానికోసమే కేటాయిస్తారు. ‘నేర్చుకోవాల్సిన వయసు వచ్చినప్పుడు పిల్లలు అన్నీ నేర్చుకుంటారు. తొందరపెట్టి వాళ్లలో ఒత్తిడి పెంచాల్సిన పనిలే'దంటారు అక్కడి ఉపాధ్యాయులు

చదువంతా #ఉచితం
ఉన్నత విద్యావంతులే మంచి పౌరులుగా మారతారు. అలాంటి ప్రజలున్న దేశమే గొప్పదిగా ఎదుగుతుందన్నది ఫిన్లాండ్‌ నమ్మిన సిద్ధాంతం. అందుకే ఆ దేశంలో పుట్టిన ప్రతి చిన్నారి చదువు బాధ్యతనూ ప్రభుత్వమే భుజాన వేసుకుంది. ఎనిమిది నెలల వయసులో డే కేర్‌ సెంటర్‌లో కాలుపెట్టినప్పట్నుంచీ పాతికేళ్ల తరవాత యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకునేంత వరకూ రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచిత విద్యను అందిస్తోంది. ప్రైవేటు పాఠశాలలూ, ప్రైవేటు యూనివర్సిటీల ప్రస్తావనే అక్కడ కనిపించదు. చిన్న కార్మికుడి నుంచి దేశాధినేత వరకూ అందరూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకొని బయటకు రావాల్సిందే. పుట్టుకతో ఎంత సంపన్నులైనా చదువు విషయంలో మాత్రం అక్కడి పిల్లలంతా సమానమే. చిన్న పల్లెటూరు నుంచి దేశ రాజధాని వరకూ అన్ని స్కూళ్లలో ఒకే తరహా శిక్షణ పిల్లలకు అందుతుంది.

ఆరేళ్లదాకా ఆడుతూపాడుతూ...
స్వెటర్లూ, ఉయ్యాలా, ఉగ్గు గిన్నె... పసిపిల్లల తల్లిదండ్రులకు ఎవరైనా ఇలాంటి చిరు కానుకలిస్తారు. ఫిన్లాండ్‌లో మాత్రం బిడ్డ పుట్టాక ఆస్పత్రి నుంచి వెళ్లేప్పుడు వైద్యులు మూడు పుస్తకాలను తల్లిదండ్రుల చేతిలో పెడతారు. పిల్లల్ని బాగా చదివిస్తూనే, తల్లిదండ్రులూ పుస్తకాల్ని చదివే అలవాటు కొనసాగించాలని సూచిస్తూ ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే తొలి రోజుల్లో తల్లి సంరక్షణ చాలా కీలకం. అందుకే అన్ని సంస్థలూ తప్పనిసరిగా ఎనిమిది నెలల ప్రసూతి సెలవుల్ని మహిళలకు అందిస్తాయి. ఆ తరవాత కూడా ఉద్యోగానికి వెళ్లని తల్లులు ఆదాయం గురించి బెంగపడకుండా మూడేళ్లపాటు ‘డే కేర్‌ ఎలొవెన్స్‌’ పేరుతో ప్రభుత్వం కొంత డబ్బుని చెల్లిస్తుంది. కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే తల్లుల సంఖ్య అక్కడ ఐదు శాతంలోపే. దానికి కారణం ప్రభుత్వ పరిధిలో ఉచితంగా పనిచేసే ‘డే కేర్‌’ కేంద్రాలే. ఎనిమిది నెలల వయసు నుంచి ఆరేళ్లు వచ్చే వరకూ పిల్లలంతా ఆ ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో హాయిగా పెరగొచ్చు. అక్కడ ప్రతి పన్నెండు మంది పిల్లలకూ ఓ టీచర్‌, ఇద్దరు నర్సుల చొప్పున అందుబాటులో ఉంటారు. చిన్నారుల ఆలనాపాలనతో పాటు వాళ్లలో జీవన నైపుణ్యాలు పెంచే బాధ్యతనూ వాళ్లే తీసుకుంటారు. దాదాపు ఐదేళ్ల పాటు ఒకే ఉపాధ్యాయుడి దగ్గర పన్నెండు మంది పిల్లలు పెరుగుతారు. తల్లిదండ్రుల తరవాత పిల్లలకు అంతటి అనుబంధం టీచర్లతోనే అల్లుకుంటుంది. దాంతో వాళ్ల స్వభావాన్నీ, సామర్థ్యాన్నీ అర్థం చేసుకుని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకు దొరుకుతుంది. ఆ ఐదేళ్లూ తరగతి గది పాఠాలు పిల్లల దగ్గరకి రావు. పక్షులూ, జంతువులూ, చెట్లూ, మనుషులూ, ఆహారం... ఇలా చుట్టూ కనిపించే అంశాల గురించే పిల్లలకు నేర్పిస్తారు. సంరక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తయ్యాక కూడా ఏ స్కూల్లో చేర్పించాలా అని తల్లులు తలలు పట్టుకోవాల్సిన పనిలేదు. పల్లె నుంచి పట్నం దాకా ప్రతి స్కూలుకీ, ప్రభుత్వం నుంచి ఒకే స్థాయిలో నిధులు అందుతాయి. ఒకే తరహా విద్యార్హతలూ, సామర్థ్యమున్న ఉపాధ్యాయులుంటారు. అన్ని పాఠశాలల్లో ఒకేలాంటి సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయి. అంటే... అక్కడన్నీ మంచి స్కూళ్లే!

రోజూ ఒంటిపూట బడులే... 
ఏడేళ్ల వయసు నుంచీ పదహారేళ్ల వరకూ, అంటే ఒకటి నుంచి తొమ్మిదో గ్రేడ్‌ దాకా ప్రతి ఒక్కరూ కచ్చితంగా చదువుకొని తీరాలన్నది ఫిన్లాండ్‌లో తూచా తప్పకుండా అమలయ్యే నిబంధన. అందుకే ప్రస్తుత తరంలో అక్కడ నిరక్షరాస్యులు ఒక్కరంటే ఒక్కరూ కనిపించరు. పేరుకే అది నిర్బంధ విద్య. ఆచరణలో మాత్రం అక్కడి తరగతి గదులు పిల్లల పాలిట స్వర్గధామాలే. ఒంటిమీద రంగురంగుల దుస్తులుంటేనే పిల్లలకు ఉత్సాహం. అందుకే అక్కడ స్కూళ్లలో ఏకరూప దుస్తుల(యూనిఫాం) విధానాన్ని ఎప్పుడో పక్కనపెట్టారు. చదువూ, పుస్తకాలూ పిల్లలకెప్పుడూ భారం కాకూడదని ‘హోం వర్క్‌’ సంస్కృతినీ దూరం చేశారు. ఆరో తరగతి దాకా పిల్లలు ఇంటి దగ్గర పుస్తకం తెరవాల్సిన పనిలేదు. ఆపై తరగతుల వాళ్లకు ఇచ్చే హోంవర్క్‌ని పూర్తిచేయడానికి అరగంటకు మించి సమయం పట్టకూడదన్నది మరో నిబంధన. పిల్లల నిద్రకు ఫిన్లాండ్‌ చాలా ప్రాధాన్యమిస్తుంది. అందుకే పాఠశాలల గేట్లు తొమ్మిది తరవాతే తెరుచుకుని, మధ్యాహ్నం రెండున్నరకల్లా మూతబడతాయి. అంటే హైస్కూల్‌ పూర్తయ్యేదాకా అక్కడ పిల్లలకు నిత్యం ఒంటిపూట బడులే. రోజుకి ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు పీరియడ్లకు మించి జరగవు. ప్రతి పీరియడ్‌కీ మధ్యలో కనీసం పదిహేను నిమిషాల విరామం ఉంటుంది. ఆ సమయంలో ఠంచనుగా పిల్లలకు చిరుతిళ్లు అందుతాయి. రోజుకో గంట ఆటల విరామమూ తప్పనిసరి. పిల్లల భోజనం గురించీ తల్లిదండ్రులు బెంగపడాల్సిన పనిలేదు. చదువు పూర్తయ్యేదాకా చక్కని పోషకాహారాన్ని- పిల్లలకు ఇష్టమైన రుచుల్లో ప్రతి రోజూ ప్రభుత్వమే పూర్తి ఉచితంగా అందిస్తుంది.

ర్యాంకులకు చెల్లు!
‘అందరూ సమానంగా చదవాలీ, అందరూ టాపర్లు కావాలీ’ అన్నది ఫిన్లాండ్‌ విద్యాశాఖ లక్ష్యం. అందుకే విద్యార్థుల మధ్య హెచ్చుతగ్గులను ఎత్తి చూపే పరీక్షలూ, మార్కుల సంస్కృతికి ఆ దేశం పూర్తిగా దూరమైంది. అన్ని దేశాల్లోలా త్రైమాసిక, వార్షిక పరీక్షలంటూ పిల్లలకు వేధింపులుండవు. ఒక్కో తరగతిలో 15-20కి మించి విద్యార్థులు ఉండటానికి వీల్లేదు. కనీసం నాలుగు తరగతుల వరకూ ఒకే ఉపాధ్యాయుల బృందం పిల్లలకు పాఠాలు చెబుతుంది. అంటే వరసగా నాలుగేళ్ల పాటు పిల్లల సామర్థ్యం, తెలివితేటలూ, సబ్జెక్టులపైన పట్టూ లాంటి అన్ని అంశాల గురించీ టీచర్లకు అవగాహన కలుగుతుంది. దాంతో పిల్లల్లోని లోపాలను సరిచేస్తూ, ఏటికేడూ వాళ్లని మెరుగుపరచడానికి కావల్సినంత సమయమూ టీచర్లకు దొరుకుతుంది. ఒకట్రెండు పరీక్షలతో కాకుండా ఎప్పటికప్పుడు రకరకాల అంశాల్లో విద్యార్థులు చూపే ప్రతిభ ఆధారంగా వాళ్ల సామర్థ్యాన్ని టీచర్లు అంచనా వేస్తారు. ఏడాది చివర్లో మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లో పరీక్షలు పెట్టినా, వాటిలో మార్కుల్ని మాత్రం బయట పెట్టరు. అంటే... పరీక్షలు రాసేది విద్యార్థులైనా, వాటి ద్వారా తామెంత బాగా చెబుతున్నదీ, తాము చెబుతున్న విషయాల్ని పిల్లలు ఏమేరకు అర్థం చేసుకుంటున్నారన్నదీ టీచర్లు అంచనా వేసుకుంటారు. ఆ జవాబు పత్రాల ఆధారంగా మరుసటి ఏడాది తమ శిక్షణ తీరులో మార్పులు చేసుకుంటారు. మొత్తంగా ఒక్కో తరగతి మారే కొద్దీ విద్యార్థుల విజ్ఞానంతో పాటు వ్యక్తిత్వాన్నీ పెంపొందించడమే లక్ష్యంగా ఫిన్లాండ్‌ విద్యా విధానం సాగుతుంది.

ఒకే ఒక్క పరీక్ష!
పదహారేళ్లు వచ్చే వరకూ పరీక్షలే తెలీకుండా పెరిగిన విద్యార్థులు, తొమ్మిదో గ్రేడ్‌ చివర్లో తమ జీవితంలో తొలి ‘పెద్ద పరీక్ష’ రాస్తారు. పైచదువులకు వెళ్లాలంటే అది పాసై తీరాల్సిందే. అపరిమితమైన పాఠాలూ, పిల్లలకు భవిష్యత్తులో ఏమాత్రం ఉపయోగపడని అంశాలూ ఫిన్లాండ్‌ విద్యావ్యవస్థలో కనిపించవు. పైతరగతుల్లో, రోజువారీ వృత్తుల్లో ఉపయోగపడే లెక్కలూ, సైన్స్‌కి సంబంధించిన అంశాలను పరిమితంగానే వారికి నేర్పిస్తారు. పరీక్షలు కూడా విద్యార్థులు బుర్రలు బద్దలుకొట్టుకునేంత కఠినంగా కాకుండా, ఆయా అంశాల్లో వారి ప్రాథమిక జ్ఞానాన్ని పరీక్షించేవిగానే ఉంటాయి. అందుకే పరీక్షల్లో తప్పే విద్యార్థులు దాదాపుగా ఉండరు. తొమ్మిదో గ్రేడ్‌ తరవాత చదువు కొనసాగించాలా వద్దా అన్నది పిల్లల ఇష్టం. ఉన్నత డిగ్రీలు చదవాలనుకునేవాళ్లు ‘అప్పర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌’ కాలేజీల బాట పడతారు. చదువుపైన ఆసక్తి లేని వాళ్లు వొకేషనల్‌ కోర్సుల్లో శిక్షణ తీసుకొని జీవితాల్లో స్థిరపడతారు. రెండిట్లో ఏ దారి ఎంచుకున్నా, ఆ ఫీజుల భారమంతా ప్రభుత్వానిదే. మొత్తంగా చదువు పూర్తయ్యేవరకూ పిల్లల ఖర్చులూ, పాఠశాలలో విద్యా ప్రమాణాల గురించి ఆలోచించాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉండదు. పోటీ, ఒత్తిడిలో పడిపోయి బాల్యాన్ని కోల్పోవాల్సిన అగత్యం పిల్లలకూ ఉండదు.

టీచరే సూపర్‌స్టార్‌!
‘బతకలేక బడిపంతులు’ అన్న నానుడిని ఫిన్లాండ్‌లో ‘బతకాలంటే బడిపంతులే’ అని మార్చుకోవాల్సిందే! ఆ దేశంలో అత్యంత గౌరవ ప్రదమైన వృత్తుల్లో వైద్యుల తరవాతి స్థానం ఉపాధ్యాయుడిదే. జీతాల విషయంలోనూ అదే వరస. టాలెంట్‌ ఉన్న టీచర్లను ఆ దేశం నెత్తిన పెట్టుకుంటుంది. తమ ఎదుగుదలకు ముఖ్య కారణం మంచి ఉపాధ్యాయులే అని బల్లగుద్ది మరీ చెబుతుంది. అందుకే ఫిన్లాండ్‌లో బోధన ఓ ‘స్టార్‌ ఉద్యోగం’. కుర్రాళ్లంతా టీచర్‌గా మారడానికి ఉవ్విళ్లూరతారు. యూనివర్సిటీలో చదువుకునే రోజుల్నుంచే దానికోసం కసరత్తు మొదలుపెడతారు. కానీ ఆ ఉద్యోగం పొందడం అంత సులువైన పనికాదు. ఓ ఆర్నెల్లు పుస్తకాలు తిరగేసి, పరీక్ష రాసి టీచర్‌గా మారిపోదాం అంటే కుదరదు. ఎలిమెంటరీ స్కూల్‌ టీచర్‌గా చేరాలంటే కనీసం మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సెకండరీ స్కూల్‌ టీచర్లకైతే పీహెచ్‌డీ తప్పనిసరి. ఏటా టీచర్‌ పోస్టులకు వచ్చే దరఖాస్తుల్లో కేవలం పదిశాతమే తుది పరిశీలనకు ఎంపికవుతాయి. వాటిని జల్లెడపడితే ఎక్కువ శాతం మంది వివిధ యూనివర్సిటీల టాపర్లే కనిపిస్తారు. ఉద్యోగ ప్రవేశ పరీక్ష ద్వారా వాళ్లలోంచి ఇంకొందర్ని ఎంపికచేస్తారు. ఆ తరవాతి దశ ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల వ్యక్తిత్వం, విజ్ఞానం, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను అంచనా వేస్తారు. కేవలం జీతం కోసం కాకుండా బోధనపైన ప్రేమతో ఆ వృత్తిలో అడుగుపెట్టేవాళ్లనే చివరికి ఎంపికచేస్తారు. రెండు మూడు నెలల పాటు సాగే ఆ ప్రక్రియ మన సివిల్‌ సర్వీసు అభ్యర్థుల ఎంపికకు ఏమాత్రం తీసిపోదు. ఎంపికైన టీచర్లకు ఏడాది పాటు పిల్లలకు బోధించే విధానాలపైన శిక్షణ ఉంటుంది. అన్ని కఠినమైన దశల్ని దాటొస్తారు కాబట్టే టీచర్లంటే అక్కడి వాళ్లకి అంత గౌరవం. పిల్లలకు శిక్షణ ఇవ్వడం తప్ప శిక్షించే సంస్కృతి స్కూళ్లలో కనిపించదు. ఆ గురువులపైన అంత నమ్మకం ఉండబట్టే అక్కడ ‘పేరెంట్‌-టీచర్‌’ సమావేశాలకూ చోటు లేదు. ‘లెస్‌ ఈజ్‌ మోర్‌’ అన్నది ఫిన్లాండ్‌ ప్రజల జీవన సూత్రం. అందుకే పసిమెదళ్లపైన గుది బండలా మారే మార్కులూ, ర్యాంకులూ, గ్రేడ్ల విధానాలూ, టాపర్లూ-మొద్దులూ అన్న తారతమ్యాలూ, పేదా-గొప్పా తేడాలూ, మంచి స్కూళ్లూ-చెడ్డ స్కూళ్లూ అన్న భేదాలూ, పల్లెలూ-పట్టణాలూ అన్న వ్యత్యాసాలూ అక్కడి వ్యవస్థలో లేవు. పిల్లలంతా ఒక్కటే, వాళ్లకు అందాల్సిన విద్యా ఒక్కటే అన్న సిద్ధాంతాన్ని మనసావాచాకర్మణా అనుసరిస్తున్నారు. పాఠ్య పుస్తకాన్ని చేతిలో పెట్టడానికి ముందే పిల్లల వ్యక్తిత్వాన్ని నిర్మించే పాఠాలకు పునాది వేస్తున్నారు. మంచి విద్యార్థులనూ, పౌరులనూ దేశానికి అందించడానికి పిల్లల దృష్టిలో చెడ్డ తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా మిగలాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నారు.

అక్షరాస్యతలో నంబర్‌ 1
గతేడాది కనెక్టికట్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వే ప్రకారం, ప్రపంచంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన దేశాల్లో తొలిస్థానం ఫిన్లాండ్‌ది (100శాతం). చదువుతో పాటు చదువుకున్న వాళ్ల వ్యవహారశైలినీ పరిగణనలోకి తీసుకొని నిర్వహించిన నాగరిక దేశాల సర్వేలోనూ దానికి తొలి స్థానం దక్కింది.

* తరగతిలోని విద్యార్థుల మధ్య ప్రతిభ విషయంలో అతి తక్కువ వ్యత్యాసం ఉన్న దేశం ఫిన్లాండే. తెలివైన విద్యార్థులకంటే, త్వరగా పాఠాలను అర్థం చేసుకోలేని పిల్లల దగ్గరే టీచర్లు ఎక్కువ సమయం గడపడం, సగటున పదిహేను మంది పిల్లలకు ఒక టీచర్‌ ఉండటం దానికి కారణం. ప్రతిభ ఆధారంగా పిల్లల్ని వేర్వేరు సెక్షన్లలో కూర్చోబెట్టే పద్ధతే వాళ్లకు తెలీదు.

* ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ బోధనా గంటలూ, స్కూళ్లకు ఎక్కువ సెలవులూ ఉన్న దేశం ఫిన్లాండే. అక్కడ స్కూళ్లు గరిష్టంగా 180రోజులు మాత్రమే పనిచేస్తాయి. భారత్‌లో దాదాపు 240 రోజులపాటు తెరిచుంటాయి. అక్కడ సగటున ఒక ఉపాధ్యాయుడు ఏడాదికి 600గంటల పాటు పాఠాలు చెబుతాడు. అదే మన దేశంలో ఆ సంఖ్య దాదాపు 1700 గంటలు. అంటే ఫిన్లాండ్‌ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.

* భవిష్యత్తులో విద్యార్థుల వృత్తిగత జీవితంలో పెద్దగా ఉపయోగపడని జాగ్రఫీ, హిస్టరీ లాంటి కొన్ని సబ్జెక్టులను ఈ ఏడాది నుంచి ఫిన్లాండ్‌ హైస్కూళ్లలో తొలగించాలని నిర్ణయించారు. వాటి స్థానంలో ప్రస్తుత తరంలో జోరు మీదున్న రెస్టరెంట్లూ, జిమ్‌లూ, స్టార్టప్‌ల లాంటి సమకాలీన అంశాల గురించి బోధిస్తారు.

* ఫిన్లాండ్‌లో స్కూల్‌ సిలబస్‌ను తయారు చేసే బాధ్యత పూర్తిగా టీచర్లదే. వివిధ ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త పాఠ్యాంశాలను చేరుస్తూ, పాతవాటిని తొలగిస్తూ ఉంటాయి. 

* ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో పిల్లల పుస్తకాల్ని ప్రచురించే దేశం ఫిన్లాండే. ప్రతి సిటీ బస్సులో, రైల్లో ఓ పుస్తకాల స్టాండ్‌ కనిపిస్తుంది. విదేశీ కార్యక్రమాలని అనువదించకుండానే అక్కడి టీవీల్లో ప్రసారం చేస్తూ, వాటి కింద సబ్‌టైటిళ్లు వేస్తారు. టీవీ చూస్తూనే పిల్లలు స్థానిక భాషను చదవడం నేర్చుకునేందుకే ఆ పద్ధతి. 

 * పదకొండేళ్లు వచ్చాకే ఫిన్లాండ్‌ పిల్లలకు ఇంగ్లిష్‌ పాఠాలు మొదలవుతాయి. అప్పటిదాకా బోధనంతా ఫిన్నిష్‌, స్వీడిష్‌ భాషల్లో సాగుతుంది. అక్కడ ఒక్కో విద్యార్థి సగటున నాలుగు భాషలు మాట్లాడగలడు. 

 * పోటీ పరీక్షలూ, కాలేజీలకు ప్రవేశ పరీక్షలూ, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లూ లేని దేశం ఫిన్లాండ్‌. హైస్కూల్‌ దశలోనే విద్యార్థులు తమ భవిష్యత్తుని నిర్ణయించుకుని దానికి తగ్గ కోర్సులే చేస్తారు. ఆ విద్యార్థుల సంఖ్యకు సరిపడా వృత్తి విద్యా సీట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది.

అదే తేడా!
‘ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కో-ఆపరేషన్‌ డెవలప్‌మెంట్‌’ అనే సంస్థ మూడేళ్లకోసారి ప్రపంచస్థాయిలో లెక్కలూ, సైన్స్‌లాంటి వివిధ అంశాల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఓ పరీక్ష నిర్వహిస్తుంది. నాలుగేళ్ల క్రితం ఆ పోటీలో పాల్గొన్న భారత్‌కు చివరి నుంచి రెండో స్థానం దక్కింది. దాంతో తరవాతి పరీక్షలో భారత్‌ పాల్గొనలేదు. అదే పోటీలో ఫిన్లాండ్ ఎన్నో ఏళ్లుగా నిలకడగా తొలి స్థానాన్ని సాధిస్తోంది. అక్కడి తలసరి ఆదాయంలో ఏడు శాతాన్ని చదువుపైన ఖర్చు చేస్తుంటే, భారత్‌లో 3.3శాతాన్నే ఖర్చుచేస్తున్నారు. అక్కడ హైస్కూల్‌ టీచర్ల సగటు నెలసరి ఆదాయం రెండున్నర లక్షలు. ఇక్కడది రూ.31వేలు. అక్కడ నెలరోజుల్లో చెప్పే పాఠాల్ని, ఇక్కడ వారంలోనే ముగిస్తున్నారు. ఇలా ఎన్నో అంశాల్లో భారత్‌లాంటి అనేక దేశాలతో ఫిన్లాండ్‌కి ఉన్న స్పష్టమైన తేడాలే, ఆ దేశ విద్యా వ్యవస్థని తిరుగులేని స్థానంలో నిలబెట్టాయి.

నలభై ఐదేళ్ల క్రితం...
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో ఫిన్లాండ్‌ ఒకటి. 1970 వరకూ అక్కడి విద్యావ్యవస్థ నాసిరకంగా ఉండేది. సహజ వనరుల లభ్యతా తక్కువే. అలాంటి పరిస్థితుల్లో దేశం ముందుకెళ్లాలన్నా, ఇతర దేశాలతో సమానంగా ఎదగాలన్నా చదువుకున్న పౌరులే కీలకమని నాటి ప్రభుత్వ పెద్దలు నమ్మారు. డబ్బున్న వాళ్లంతా పిల్లల్ని మంచి స్కూళ్లకు పంపిస్తున్నారనీ, సామాన్యులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారనీ అర్థం చేసుకున్నారు. దాంతో ఎనభయ్యో దశకం తొలినాళ్లలో ప్రక్షాళన మొదలుపెట్టారు. దేశ విద్యా వ్యవస్థనంతా ప్రభుత్వం తన అధీనంలోకే తీసుకొని, ప్రైవేటు విద్యాసంస్థల్ని రద్దు చేసింది. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరికీ సమానమైన విద్యను ఉచితంగా అందించడం మొదలుపెట్టింది. అలా గత నలభై ఐదేళ్లుగా విద్యా ప్రమాణాల్లో ఎన్నో మైలురాళ్లను దాటి, విద్యార్థుల సామర్థ్యం విషయంలో అగ్రరాజ్యాలనూ వెనక్కునెట్టి దూసుకెళ్తొంది. ప్రభుత్వం, తల్లిదండ్రులూ, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం, ఒకరిపైన ఒకరికి సంపూర్ణ నమ్మకం ద్వారా సాధ్యమైన విజయం.

మనకీ కొత్త విద్యాసంవత్సరం మొదలవుతోంది. కోటి ఆశలతో లక్షలాది పిల్లలు బడిబాట పడుతున్నారు. వాళ్ల చదువులు కూడా ఫిన్లాండ్‌ విద్యార్థుల చదువులంత హాయిగా సాగాలంటే, మన ఆలోచనలూ అక్కడి తల్లిదండ్రులూ ఉపాధ్యాయుల ఆలోచనలంత ఉన్నతంగా మారాలి. మన ప్రభుత్వాలూ అక్కడి విధానాల్లో కొన్నింటినైనా ఆచరణలోకి తేవాలి. పిల్లల నుంచి ఆశించడం మానేసి, వాళ్లని అర్థం చేసుకోవడం మొదలుపెడితే చాలు, ఉత్తమ ఫలితాలు వాటంతట అవే వస్తాయనడానికి ఫిన్లాండ్‌ విజయాలే సాక్ష్యం. ఆ దేశంలో పరీక్షల విధానం లేకపోవచ్చు. కానీ విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దడమన్నది ఏ దేశానికైనా పెద్ద పరీక్షే. అందులో ఫిన్లాండ్‌కి మరో ఆలోచన లేకుండా వందకి వంద మార్కులూ వేయాల్సిందే..!

All Updates

TSLPRB Updates

TET DSC Gurukula Updadtes

Job Notifications

Important Links

Centran Jobs Updates

TSPSC VRO FInal Merit Lists and Cut off Marks

Important Links

TSPSCvro District wise Reservation wise Marks and Merit lists

Top